
వైసిపి నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎల్ అభినందన
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా : నరేంద్రకుమార్
ప్రజాశక్తి - పాలకోడేరు
నీతి.. నిజాయితీతో పాటు నిబద్ధతకు నిదర్శనం గొల్లలకోడేరు గ్రామానికి చెందిన వైసిపి గ్రామ కన్వీనర్ చేకూరి రాజానరేంద్రకుమార్ అని ప్రతి నోటా ఇదే మాట వినిపిస్తూ ఉంటుంది. స్వార్థం లేకుండా ఏమి ఆశించకుండా ఎదుటివాళ్లకు సహాయపడి అండగా నిలబడే మనసున్న మారాజు నరేంద్రకుమార్ అని గ్రామస్తులు చెబుతుంటారు. వైసిపిలో నరేంద్రకుమార్ సుదీర్ఘ కాలం పాటు పార్టీకి అనేక సేవలందిస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడుతూనే నాయకులు, కార్యకర్తలను సమన్వయ పరుస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం నరేంద్రకుమార్ సేవలను గుర్తించి నిబద్ధతకు పట్టం కట్టింది. వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి, డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు నరేంద్రకుమార్కు ఉండి ఎఎంసి ఉపాధ్యక్షుని పదవిని కట్టబెట్టారు. ఈ పదవిని ఎంతోమంది ఆశించినప్పటికీ మరెన్నో పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ పివిఎల్ నరసింహరాజు మాత్రం వైసిపి పట్ల విధేయత, నిబద్ధత కలిగిన నరేంద్రకుమార్కు కేటాయించారు. వివాద రహితుడైన నరేంద్రకుమార్ను ఎఎంసి ఉపాధ్యక్షునిగా నియమించడం పట్ల అంత హర్షం వ్యక్తమవుతుంది. దీనిలో భాగంగా ఎఎంసి ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్రకుమార్ స్థానిక పార్టీ కార్యాలయంలో పివిఎల్ నరసింహరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పివిఎల్ నరేంద్రకుమార్కు స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేసి అభినందించారు. పార్టీలో కష్టపడుతున్న వారికి గుర్తింపు ఎప్పుడూ ఉంటుందని, దీనికి నరేంద్రకుమారే నిదర్శనమని పివిఎల్ చెప్పారు. నరేంద్రకుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పదవి కేటాయించిన పివిఎల్కు రుణపడి ఉన్నానన్నారు. తనపై ఉంచిన నమ్మకన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. పదవి తనపై మరింత బాధ్యత పెంచిందని అటు పార్టీకి ఇటు ఎఎంసికి, రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని చెప్పారు.