Jun 01,2023 22:45

ప్రజాశక్తి - మంగళగిరి : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ 4-11 తేదీల్లో విజయనగరంలో నిర్వహించే ఉమెన్‌ టి20 క్రికెట్‌ లీగ్‌లో బెజవాడ బ్లేజర్స్‌ జట్టుకు మంగళగిరికి కడియం వాసవి అఖిలపావని ఎంపికయ్యారు. సీజన్‌-2లో భాగంగా నిర్వహించే లీగ్‌లో విజయనగరం రాయల్స్‌, బెజవాడ బ్లేజర్స్‌, రాయలసీమ క్వీన్స్‌, వైజాగ్‌ డాల్ఫిన్స్‌ జట్లు తలపడనున్నాయి. బెజవాడ బ్లేజర్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించే పావని లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌, ఆల్‌ రౌండర్‌గా తన ప్రతిభను చూపనునానరు. విజయవాడ నలంద డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్‌ చదువుతున్న పావని ఎనిమిదేళ్లుగా క్రికెట్‌ సాధన చేస్తున్నారు. కోచ్‌లు కృష్ణారావు, మస్తాన్‌రెడ్డి పర్యవేక్షణలో మెలకువలు నేర్చుకుంటూ రాణిస్తున్నారు. మొదటి సీజన్‌లో వైజాగ్‌ డాల్ఫిన్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన పావన ఆ జట్టు రన్నరప్‌గా నిలవడంలో తన వంతు కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా క్రికెటరల్లో పావని బౌలింగ్‌లో మూడో స్థానంలో, లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌లో ప్రథమ స్థానంలో ఉన్నారు. అనేక టోర్నీలు ఆడిన పావని మంగళగిరి నుంచి మొదటి మహిళా క్రికెట్‌ ప్లేయర్‌ కావడం గమనార్హం. పావని తండ్రి శ్రీనివాసరావు స్థానిక మలేరియా డిపార్టుమెంటులో ఎంపిహెచ్‌ఎగా పనిచేస్తున్నారు. సోదరుడు పవన్‌ సాయి రాహుల్‌ కూడా క్రికెటరే.