
ప్రజాశక్తి - విలేకర్ల యంత్రాంగం
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం చేపట్టిన ఉత్తరాంధ్ర జిల్లాలో చేపట్టిన బైక్ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ జిల్లాలో సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కశింకోట : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సిపిఎం చేపట్టిన బైక్ యాత్రలో భాగస్వాములు కావాలని యువకులు, నిరుద్యోగులకు సిపిఎం నాయకులు సోమవారం కరపత్రాలు పంపిణీ చేసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు దాకారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ బుధవారం అనకాపల్లి విచ్చేయుచున్న సందర్భంగా అందరూ తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.మూర్తి, చిన్న, వెంకట్రావు, అప్పారావు, జగ్గారావు, యువకులు పాల్గొన్నారు.
చోడవరం : ఈనెల 28న వి.మాడుగులలో జరుగు బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, కె.భవాని సోమవారం శంకరం పంచాయితీలో విస్తృత ప్రచారం చేశారు. యాత్ర ముగింపు సందర్భంగా కూర్మన్నపాలెం జంక్షన్లో వేలాది మందిలో జరిగే బహిరంగ సభకు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవదాసు, కోటి, శీను బాబు, విజయశాంతి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలి : ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ బైక్యాత్ర ఈ 27న యలమంచిలి చేరుకుంటున్న తరుణంలో అందరూ మద్దతుగా పాల్గొని విజయవంతం చేయాలని సోమవారం సిపిఎం సీనియర్ నాయకులు కర్రి అప్పారావు, గనిశెట్టి సత్యనారాయణ, శ్రీను తదితరులు ప్రచారం నిర్వహించారు. బస్టాండ్లోని ప్రయాణీకులు, విద్యార్ధులు, మహిళలకు కరపత్రాలు పంచారు. స్టీలు ప్లాంటును కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎస్.రాయవరం : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న సిపిఎం బైక్ యాత్రలో భాగంగా ఈనెల 26న పాయకరావుపేటలో బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.అప్పలరాజు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి స్టీల్ ప్లాంట్ను సాధించుకుని, ఆంధ్రుల హక్కుగా నిల బెట్టారన్నారు.