
ప్రజాశక్తి-ఉక్కునగరం : ఉక్కు ఉద్యమాన్ని రెండవ దశలోకి తీసుకెళ్లడంలో భాగంగా ఈ నెల 30వ తేదీన చేపట్టే ఉక్కు ప్రజా గర్జనను జయప్రదం చేయాలని స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి.దాస్ పిలుపునిచ్చారు. ఉక్కునగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటి వరకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాన్ని నిర్వహించిందని, ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికే ఉక్కు ప్రజా గర్జన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి కార్మికుడూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథిగా హాజరైన 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, మాట్లాడుతూ, స్టీల్ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగడం ద్వారానే రాష్ట్ర అభివృద్ధి ఉందన్న సత్యాన్ని వివిధ పార్టీల ప్రతినిధులు ఒప్పుకుంటున్నారని వివరించారు. ఈ నెల 23వ తేదీన గాజువాకలో ఉన్న 21 మంది కార్పొరేటర్లతో వెస్ట్ రామచంద్ర హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాలపై ఈ పోరాటం ప్రభావం చూపుతుందన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఉక్కు ప్రజా గర్జనను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్టీల్ సిఐటియు ప్రతినిధులు బి.అప్పారావు, పి.శ్రీనివాసరాజు, గంగాధర్, యు.వెంకటేశ్వర్లు, మరిడయ్య, నీలకంఠం, కృష్ణమూర్తి, పుల్లారావు, శశిరెడ్డి, ఉమామహేశ్వరరావు, ఆర్.రాజేశ్వరరావు, బిఎన్.మధుసూదన్, మొహిద్దిన్, సూర్యనారాయణ, కె.బాలశౌరి, కె.సత్యనారాయణ, వివిధ విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.