ఉగాది ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం
19 నుండి ఉగాది మహోత్సవాలు
ప్రజాశక్తి - శ్రీశైలం
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో ఘనంగా జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చేయవలసిన ఏర్పాట్లపై శుక్రవారం నాడు దేవస్థానం కార్య నిర్వహణ అధికారి లవన్న సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుపై పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం యూనిట్ శెక్షణ అధికారులతో పాటు స్థానిక తహసిల్దార్ రాజేంద్ర సింగ్ ,స్థానిక సీఐ దివాకర్ రెడ్డి, స్థానిక ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి సోమశేఖరయ్య దేవస్థానం వైద్యశాల వైద్యఅధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఒ మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కాక ఇతర రాష్ట్రాల నుండిగా కూడా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకుంటారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు విధాల చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాలినడకలో వచ్చే భక్తులకు సేద తీరేందుకు అన్ని వసతులు కల్పించాలన్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, అల్పాహారం, ఉదయం పాలు అందించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు తగిన విషయం తెలుసుకునేందుకు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. స్వామి అమ్మ వాళ్లకు ఉత్సవాలలో ప్రత్యేక అలంకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. క్షేత్రంలోని పూర్తి సమాచారం తెలుసుకునేందుకు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.










