Aug 18,2023 21:56

వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌

ప్రజాశక్తి - శ్రీకాకుళం: ప్రతి నెలా మూడో శుక్రవారం నిర్వహించే ఉద్యోగుల గ్రీవెన్స్‌ను కలెక్టరేట్‌లో నిర్వహించారు. వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలపై 26 వినతులను కలెక్టర్‌ శ్రీకేష్‌ లాఠకర్‌ స్వీకరించారు. గ్రామ, వార్డు హెల్త్‌ సెక్రటరీల అసోసియేషన్‌ ఆధ్వర్యాన గ్రామ, వార్డు సచివాలయ హెల్త్‌ సెక్రటరీల సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. 30 ఏళ్లు సర్వీస్‌ పూర్తి చేసుకున్నా తాత్కాలిక ఉద్యోగులుగానే మిగిలిపోయామని, క్రమబద్ధీకరణ చేయాలని రణస్థలం జూనియర్‌ కాలేజ్‌ పార్టుటైమ్‌ లెక్చరర్‌ వై.శ్రీనివాసరావు కోరారు. ఉద్యోగులు స్పందనకు వచ్చే ముందు సమస్యలపై పూర్తిస్థాయిలో అవగాహనతో రావాలని కలెక్టర్‌ చెప్పారు. ఉద్యోగుల స్పందన కార్యక్రమానికి వచ్చే సమస్యలను జిల్లా స్థాయిలో అర్జీలు వస్తే సంబంధిత అధికారులకు పరిష్కారానికి పంపుతామని, రాష్ట్రస్థాయిలో వచ్చిన అర్జీల సమస్యలను ప్రభుత్వానికి పంపుతామన్నారు. వినతులను స్వీకరించిన వారిలో డిఆర్‌ఒ మురళీకృష్ణ, కలెక్టరేట్‌ ఎఒ రాజేశ్వరరావు, సెక్షన్‌ అధికారి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.