Nov 03,2023 20:45

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి - ఆదోని
అర్హత కలిగిన వారికి ఉద్యోగ, ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్‌ మేళాకు విశేష స్పందన లభించింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌, ఆదోని సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తరచూ ఉద్యోగ ఎంపికకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సిటెక్‌, రేడియంట్‌ సెల్కాన్‌ ఎలక్ట్రికల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌, శ్రీరామ్‌ చిట్స్‌ అండ్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌, ఎస్‌కె బయో ఎంటర్‌ప్రైజెస్‌, ఫ్యూజన్‌ మైక్రో ఫైనాన్స్‌, నవభారత్‌ ఫర్టిలైజర్స్‌, ఎన్‌ఎస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, అమర్‌ రాజా గ్రూప్‌, ఫ్లిప్‌ కార్డ్‌, సిఎంఆర్‌ ఈకో అల్యూమినియం ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఆటో సెన్స్‌, మితు భాష, ఆస్ట్రో స్టిల్స్‌, వివిధ కంపెనీల ప్రతినిధులు ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారని చెప్పారు. ఆదోని మున్సిపల్‌ ఛైర్మన్‌ బి.శాంత, ఆదోని మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ మజర్‌ అహ్మద్‌, వైస్‌ ఛైర్మన్‌ కామాక్షి తిమ్మప్ప, ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల కరస్పాండెంట్‌ సిఎబి.దైవాధీనం రెడ్డి, ఆదోని ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ మురళీమోహన్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.శ్రీకాంత రెడ్డి, నరసింహ మూర్తి పాల్గొన్నారు.