బద్వేలు : నైపుణ్యత కల్గిన యువతకు ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ధ్యేయమని ఆడా చైర్మన్ గురుమోహన్ పేర్కొన్నారు. స్థానిక శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ కళాశాలలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఇందులో దాదాపు 20 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళాలో దాదాపు 702 మంది నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. వీరిలో దాదాపు 233 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఏపీ ఎస్ఎస్డిసి, కంపెనీ అధికారులు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి అడా చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 100కు పైగా జాబ్ మేళాలు నిర్వహించామని జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 లక్షల మంది నిరుద్యోగ యువతకు సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటరీ వ్యవస్థ ద్వారా, ఏపీపీఎస్సీ ద్వారా, ఇతర అన్ని శాఖల ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించారని చెప్పారు. సగర కార్పొరేషన్ చైర్మన్ రమణమ్మ సీనయ్య మాట్లాడుతూ బద్వేల్ నాగభూషణం కళాశాలలో ఏపీ ఎస్ఎస్డిసి అధికారులు జాబ్ మేళాలు నిర్వహించడం సంతోష కరమన్నారు. బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల స్వామి మాట్లాడుతూ కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు సింగసాని శివయ్య, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ అల్లా బకాష్, నాగభూషణం కళాశాల పరిపాలన అధికారి సాయి, ఎపిఎస్ఎస్డిసి ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు, కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ వినోద్ కుమార్, కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.










