ఉచిత వైద్య శిబిరం
ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణం శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో 23వ తేదీ ఆదివారం రోజున జరగబోయే ఉచిత వైద్య శిబిరం గురించి తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎం.మాలకొండయ్య, వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ ఖాదర్ భాషా, విశ్రాంత లెక్చరర్ యమ్.వి.యన్. ప్రసాద్ రావుపాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాల డైరెక్టర్ ఎం.మాలకొండయ్య, వివిధ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షుడు షేక్ ఖాదర్ భాషా మాట్లాడుతూ సంయుక్త సేవాసంస్థ ద్వారా శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాలలో 23వ తేదీన ఆదివారం నిర్వహించబోయే 5వ ఉచిత వైద్య శిబిరానికి చుట్టుపక్కల ఎవరికైనా షుగర్, బిపి, సాధారణ గుండె సంబంధిత వ్యాధులు, చిన్న పిల్లల్లో పిడ్స్ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఉంటే వైద్య శిబిరం గురించి తెలియజేసి వైద్య సేవలు పొందేలా చేయమని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో కావలి పట్టణంలోని ప్రముఖ వైద్యులు పాల్గొని ఉచితంగా పరీక్షలు నిర్వహించి రెండు నెలలకు సరిపడా మందులను కేవలం రూ.200లకే అందజేస్తామని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో షుగర్, బిపి, రక్త శాతం, రక్తగ్రూపులు, ఇసిజి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. కావున వ్యాధి గ్రస్తులును పై వైద్య శిబిరంలో పాల్గొని వైద్య సేవలు పొందేలా చేయమని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే ప్రతి రెండు నెలలకోసారి నాల్గవ ఆదివారం ఈ వైద్య శిబిరం శ్రీ శ్రీనివాసు జూనియర్ కళాశాలలో జరుగుతుందని తెలిపారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ సంయుక్త సేవాసంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరం కావలి పట్టణం వెంగళరావు నగర్లో ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నామని తెలిపారు. కానీ ఊరి చివర కావడం కారణంగా పట్టణంలో పెడితే పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఈ వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగ పడుతుందనే ఆలోచనతో శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాల యాజమాన్యాన్ని కోరిన వెంటనే ప్రతి రెండు నెలలకు ఒకసారి వైద్య శిబిరం నిర్వహించడం కోసం అనుమతినిచ్చారని తెలిపారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి నాల్గవ ఆదివారం వైద్య శిబిరం నిర్వహించడం కోసం అనుమతిని కోరిన వెంటనే స్పందించి అనుమతిని ఇచ్చిన శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బట్టేపాటి. అశోక్కు, డైరెక్టర్స్, ఎం.మాలకొండయ్య, కోటేశ్వరరావు, రమణా రెడ్డిలకు సంయుక్త సేవా సంస్థ ద్వారా హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరానికి సంబంధించిన పత్రికలను అందజేశారు.










