ప్రజాశక్తి- అరకులోయ రూరల్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, గిరిజన సంఘం ఆధ్వర్యంలో పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ పరీక్షల ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని పంచాయతీ రాజ్ డిఇ రామం కోరారు. గత పది రోజుల నుండి అరకువేలి గిరిజన సంఘం భవనంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం, ఏపీ గిరిజన సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ పరీక్షలకు విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. సోమవారం పంచాయతీ రాజ్ డిఇ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే వెనకబడిన ప్రాంతాలు అబివృద్ధి జరుగుతాయన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యా, వైద్యం వంటి సౌకర్యాలు ఎంతో అవసరమని తెలిపారు. శిక్షణ నిర్వాహకులు చిరంజీవి మాట్లాడుతూ, గత కొంతకాలంగా విద్యార్థులకు వివిధ ఎంట్రన్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉచితంగానే శిక్షణ అందిస్తున్నామన్నారు.










