Jul 20,2023 14:44

ప్రజాశక్తి - క్యాంపస్  : శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో  ఎంఓయులు  చేసుకుని వారి వద్ద ఉన్న తాళపత్రాలను డిజిటైజ్ చేయాలని టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి ఆదేశించారు. శ్రీ వేంకటేశ్వర మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్ట్ ప్రగతిపై  ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో  గురువారం ఆయన సమీక్ష  జరిపారు. ఈ సంధర్బంగా ఈవో మాట్లాడుతూ ఇప్పటిదాకా డిజిటైజ్ చేసిన తాళపత్రాల్లో సమాజానికి ఉపయోగ పడే అంశాలున్న వాటిని పుస్తక రూపంలో తేవడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇందుకోసం అవసరమైనంత మంది స్కాలర్స్ ను  నియమించుకోవాలని సూచించారు. గత రెండు నెలలతో పోల్చితే ప్రాజెక్ట్  ప్రగతి బాగుందని అన్నారు. సనాతన జీవన ట్రస్ట్ కు చెందిన శశిధర్ ను సంప్రదించి ఆయన విరాళంగా అందిస్తానని చెప్పిన తాళపత్రాల స్కానర్ ను త్వరగా  తెప్పించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. తాళ పత్రాల సేకరణకు సంబంధించిన ఆరు నెలల ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా పని చేయాలన్నారు. తాళపత్రాల్లో మిస్ అయిన అక్షరాలను పొందుపరచగలిగే  సాఫ్ట్ వేర్ ను  ఏర్పాటు చేసుకోవడానికి సంబంధిత వ్యక్తులతో చర్చించాలని  ఈవో సూచించారు. ప్రస్తుతం ఉన్న తాళపత్ర బండిల్స్ లో మిగిలిన  సుమారు  వెయ్యి బండిల్స్ ను రాబోయే మూడు నెలల్లో స్కానింగ్ పూర్తి చేయాలని ఈవో  చెప్పారు.  ఈ కార్యక్రమంలో జేఈవో  సదా భార్గవి, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణిసదాశివమూర్తి, మ్యాన్ స్క్రిప్ట్స్ ప్రాజెక్టు  ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య రాధేశ్యామ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.