Sep 14,2023 22:03

నూజివీడు సబ్‌ డివిజన్‌ ఉపకార్యనిర్వాహక ఇంజినీర్‌ బాబూరావు
 ప్రజాశక్తి - చాట్రాయి

            మండలంలోని చా ట్రాయి, చిత్తపూరు మధ్య గొల్లగూడెం వద్ద రోడ్డుకు త్వరలోనే మరమ్మతులు చేస్తామని నూజివీడు సబ్‌ డివిజన్‌ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌ సిహెచ్‌.బాబూరావు తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఆయన గురువారం పరిశీలించారు. గొల్లగూడెం వద్ద రోడ్డుపై గుంతలు పడి అధ్వానంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్య పరిష్కరించాలని కోరుతూ ఆరుగొలనుపేట గ్రామానికి చెందిన పుచ్చకాయల శేఖర్‌రెడ్డి ఈ నెల 11వ తేదీన సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. స్పందన అర్జీపై నూజివీడు సబ్‌ డివిజన్‌ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌ సిహెచ్‌.బాబూరావు స్పందించి గొల్లగూడెం రోడ్డు ప్రదేశాన్ని పరిశీలించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. బురుగుగూడెం నుంచి చిత్తపూరు వరకు వార్షిక మరమ్మతుల కింద నిధులు మంజూరయ్యాయని, టెండర్లు కూడా పిలిచామని, కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ అయిన వెంటనే మరమ్మతులు ప్రారంభిస్తామని ఎండార్స్‌మెంట్‌ ద్వారా తెలిపారు.