
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: మూలపేట పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు నిర్మించ తలపెట్టిన పునరావాస కాలనీల్లో త్వరితగతిన పనులు చేపట్టాలని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. మూలపేట పునరావాస కాలనీల్లో రహదారులు, కాలువలు, తాగునీరు సరఫరా వంటి మౌలిక వసతుల కల్పనపై జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్తో కలిసి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో అంతర్గత సిసి రహదారులు, కాలువలు త్వరితగతిన నాణ్యతతో చేపట్టాలని ఆదేశించారు. పనులకు సంబంధించి నిధులు ఇప్పటికే మంజూరు చేసినట్లు వివరించారు. టెక్కలి సమీపాన గల తేలినీలాపురం నుంచి తాగునీరు పైపులైన్ల ద్వారా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఇ ప్రసాదరావు తెలిపారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్ఇ సత్యనారాయణమూర్తి, సర్వేశాఖ ఎడి విజరు కుమార్, డిఇ, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు శ్రీనివాసరావు, రామ్మూర్తి, ఎఇలు పాల్గొన్నారు.