Feb 14,2023 23:58

ఆర్‌కె.బీచ్‌లో ప్రారంభిస్తున్న కమిషనర్‌ శ్రీకాంత్‌

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : విశాఖపట్నం ఆర్‌కె.బీచ్‌ వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన టూరిస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం వర్చువల్‌గా ప్రాంభించారు. అనంతరం నగర పోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌.శ్రీకాంత్‌ టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ యొక్క శిలాఫలకాన్ని ఆవిష్కరించి సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా సిహెచ్‌.శ్రీకాంత్‌ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి సంవత్సరమూ సుమారు కోటీ పది లక్షలకుపైగా పర్యాటకులు ఈ బీచ్‌ను సందర్శిస్తారని, పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ టూరిస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పర్యాటకులకు ఈ టూరిస్ట్‌ పోలీసుస్టేషన్‌ 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, ఇక్కడ ఎలాంటి సహాయమైనా పొందవచ్చని వివరించారు. పర్యాటకులు ఈ టూరిస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సేవలు పొందుటకు 9490617924 /9493336633 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా లారస్‌ కంపెనీ సిఎస్‌ఆర్‌ నిధులు రూ.27,86,288తో 2 (సాగర్‌) సాండ్‌ పెట్రోలింగ్‌ వాహనాలను, 10 పోలీస్‌ పెట్రోల్‌ ద్విచక్ర వాహనాలను నగర పోలీస్‌ విభాగానికి అందించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.