Feb 21,2023 23:20

వృక్షాలు మాయంపై పరిశీలిస్తున్న దర్యాప్తు బృందం సభ్యులు

ప్రజాశక్తి -పిఎం పాలెం : బక్కన్నపాలెం సమీపంలో ఉన్న ఏపీ విభిన్న ప్రతిభావంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ (ఐటిఐ శిక్షణ ఉత్పత్తి కేంద్రం)లో తుక్కు విక్రయంపై, విలువైన వృక్షాలు మాయంపై క్షేత్రస్థాయిలో ఉద్యానవనం, అటవీశాఖ అధికారులు బృందాలుగా మంగళవారం పరిశీలించారు. జరిగిన అవినీతిపై ఇప్పటికే ప్రిన్సిపల్‌ అబద్దాన్ని, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ వి.విజయకుమార్‌ను, ఇన్‌స్పెక్టర్‌ పివి.రమణమూర్తిని సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. దీనిపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ కమిటీ అధికారి, జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ సుబ్బిరెడ్డి, సబ్‌ డిఎఫ్‌ఒ ధర్మ రక్షిత్‌, జిల్లా హార్టికల్చర్‌ అధికారి మన్మధరావు, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఇంఛార్జి జె.మాధవి, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ డి.కోటేశ్వర రావు నరికివేతకు గురైన విలువైన వృక్షాలను పరిశీలించారు. పచ్చ తురాయి, తోగాము, బోగడ, శిస్సు, టేకు విలువైన వృక్షాలు నరికివేతకు గురైనట్లు గుర్తించారు. వృక్షాల వయసు, పొడవు, విలువను బట్టి ఎంత స్థాయిలో ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేయనున్నారు.