
తూకివాకం రికవరి ప్లాంట్స్ పరిశీలన
ప్రజాశక్తి- తిరుపతి టౌన్
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేస్ట్ మెటీరియల్ను రికవరి చేసే తూకివాకం మెటిరీయల్ రికవరి ఫెసిలిటి(ఎం.ఆర్.ఎఫ్) సెంటర్ను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిత డ్రై వేస్ట్ రికవరి ప్లాంట్ ను, తడి చెత్త నుండి ఎరువులు తయారు చేసే ప్లాంట్ ను అదేవిధంగా బయో మిథన్ గ్యాస్ ప్లాంట్ ను పరిశీలించి తగు సూచనలు జారీ చేసారు. ఈ సందర్భంగా తడి చెత్త నుండి ఎరువులు తయారు చేసే నిర్వాహకులతో మాట్లాడుతూ ఎరువుల ఉత్పత్తి పనులు అనుకున్న రీతిలో తయారు చేయడం లేదని, మరింత మంది మనుషులను నియమించి తడి చెత్త నుండి మరింత పెద్ద మొత్తంలో ఎరువులు తయారు చేయాలన్నారు. ఎరువుల తయారీకి అవసరమైన తడి చెత్తను సేకరించి నిరంతరం అందిస్తామన్నారు. అదేవిధంగా డ్రై వేస్ట్ రికవరి ప్లాంట్ ను పరిశీలించి, పనుల వేగవంతానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా మహేంద్ర కంపెని నిర్వహణలో పనిచేస్తున్న బయో మిథనైజేషన్ ప్లాంట్ ను పరిశీలిస్తూ సి.ఎన్.జి గ్యాస్ ఉత్పత్తికి అవసరమైన ఆహార వ్యర్థాలను, హోటళ్లలో మిగిలిన ఆహార పదార్థాలను, మార్కెట్ల నుండి పాడైన కూరగాయలు, పండ్లను సేకరించి ప్లాంట్ కి తరలించేలా తగు చర్యలు చేపడతామన్నారు. స్వచ్చ సర్వేక్షన్ నియమ నిబంధనల మేరకు అన్ని పదర్థాల నుండి రీ సైక్లింగ్ ద్వారా తిరిగి ఉపయోగంలోకి తీసుకు వచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిఈ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ప్లాంట్లు పరిశీలిస్తున్న కమిషనర్ హరిత