Nov 02,2023 21:03

ఎడ్లబండ్లతో నిరసన తెలుపుతున్న రైతులు

ప్రజాశక్తి - తుగ్గలి
తుగ్గలి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని నాయకులు, రైతులు డిమాండ్‌ చేశారు. గురువారం సిపిఎం, సిపిఐ, టిడిపి, కాంగ్రెస్‌, జనసేన ఆధ్వర్యంలో తుగ్గలిలోని గుత్తి, పత్తికొండ ప్రధాన రహదారిని దిగ్బంధించారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు ఎడ్లబండ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ జిల్లా కమిటీ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్‌, టిడిపి అధికార ప్రతినిధి మనోహర చౌదరి, సిపిఎం మండల కార్యదర్శి శ్రీరాములు, టిడిపి మండల అధ్యక్షులు తిరుపాల్‌ నాయుడు, సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్‌, కాంగ్రెస్‌ నాయకులు నాగార్జున మాట్లాడారు. అత్యంత వెనుకబడిన తుగ్గలి మండలాన్ని ప్రభుత్వము కరువుగా ప్రకటించకపోవడం బాధాకరమని తెలిపారు. నిత్యం కరువు కోరల్లో చిక్కుకునే తుగ్గలి మండలాన్ని అధికారులు ఎందుకు కరువుగా ప్రకటించలేదో అర్థం కావడం లేదన్నారు. తుగ్గలి మండలాన్ని కరువుగా ప్రకటించకపోవడం పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నిర్లక్ష్య ధోరణికి నిదర్శమని తెలిపారు. సక్రమంగా వర్షాలు కురవక పంటలు పండకపోవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని చెప్పారు. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వర్షపాతం తక్కువ నమోదైనప్పటికీ తుగ్గలి మండలాన్ని కరువుగా ప్రకటించలేదని తెలిపారు. వర్షాలు కురవకపోవడంతో పంటలన్నీ పూర్తిగా ఎండిపోయాయని చెప్పారు. తుగ్గలిని కరువు మండలంగా పట్టించే వరకు ఆందోళనలను విరమించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తుగ్గలి మండలాన్ని తక్షణమే కరువుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ రవికి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. రైతుసంఘం నాయకులు కొండారెడ్డి, గురుదాసు, ఉమాపతి, రంగరాజు, సిఐటియు నాయకులు ప్రతాప్‌, టిడిపి నాయకులు వల్లే వెంకటేష్‌, కిష్టయ్య, త్రిమూర్తులు, రవి, వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.