Oct 19,2023 20:27

బిసి రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాల, ఎంఎస్‌ఎంఇ, ఐటిఐ కాలేజీ పనులను పరిశీలిస్తున్న మంత్రి బుగ్గన

తుది దశకు అభివృద్ధి పనులు
- డిసెంబర్‌ కల్లా పూర్తి చేయాలి
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
ప్రజాశక్తి - బేతంచెర్ల

    బేతంచర్ల మండల పరిధిలోని గోరుమానుకొండ సమీపంలో చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరాయని, డిసెంబర్‌ కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ముఖ్యమంత్రి ఎమ్మిగనూరు పర్యటన ముగిశాక మంత్రి బుగ్గన బేతంచెర్ల పట్టణంలోని అభివృద్ధి పనులను పరిశీలించారు. 110 గదులతో నిర్మిస్తున్న బిసి రెసిడెన్షి యల్‌ బాలుర పాఠశాల, జూనియర్‌ కళాశాల భవన నిర్మాణాలను పరిశీలించారు. రూ.36 కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ నిర్మాణంలో ఇప్పటికే డైనింగ్‌ బ్లాక్‌, రూఫ్‌ స్లాబ్‌, ప్లాస్టెరింగ్‌, హాస్టల్‌ బ్లాక్‌-2 సహా కీలక పనులు పూర్తయినట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. మిగతా పనులు కూడా మరింత త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ఐటిఐ డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వారికి, వివిధ వృత్తి పనుల వారికి నైపుణ్య అభివృద్ధి శిక్షణను ఇచ్చే ఎంఎస్‌ఎంఇ సెంటర్‌నూ మంత్రి పరిశీలించారు. రూ.4 కోట్లతో నిర్మిస్తోన్న ఈ భవనంలో ఇప్పటికే అడ్మిన్‌ బ్లాక్‌, వర్క్‌ షాప్‌ స్లాబ్‌ పనులు సహా సింహభాగం పనులు పూర్తయినట్లు మంత్రి వివరించారు. రూ.7.8 కోట్లతో నిర్మిస్తోన్న ఐటీఐ కాలేజీ పనులు చురుకుగా జరుగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పనులన్నీ డిసెంబర్‌ నెల కల్లా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి ఆదేశించారు. ఈ కాలేజీలో అత్యాధునిక సదుపాయాలైన యంత్రాలు, పరికరాలు, సామాగ్రీ కోసం మరో రూ.3 కోట్ల నిధులను ఇప్పటికే మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం బేతంచెర్ల పట్టణంలో రూ.80 లక్షలతో కొత్తగా నిర్మిస్తోన్న ఆర్‌ అండ్‌ బి ఇన్స్‌పెక్షన్‌ బంగ్లా పనులను మంత్రి పరిశీలించారు.