Aug 07,2023 19:55

విజేత స్కూల్‌ విద్యార్థిని అభినందిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - ఆస్పరి
ఆస్పరిలోని విజేత స్కూల్‌ విద్యార్థి ఆర్‌పి.జితేంద్ర సింగ్‌ కడప జిల్లాలోని ఇడుపులపాయి దగ్గర ట్రిపుల్‌ ఐటికి ఎంపిక కావడం పట్ల తహశీల్దార్‌ కె.కుమార స్వామి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం తహశీల్దార్‌ కార్యాలయంలో జితేంద్ర సింగ్‌ను తహశీల్దార్‌ కుమారస్వామి, జిల్లా కెడిసిసి డైరెక్టర్‌ రాఘవేంద్ర, డిప్యూటీ తహశీల్దార్‌ గాయత్రి, ఎంఇఒ రాజేంద్రప్రసాద్‌, ఇఒఆర్‌డి నరసింహారెడ్డి, పిఆర్‌ ఎఇ యమునప్ప అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విజేత స్కూల్‌లో చదువుతూ పది పరీక్షల్లో 586 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. కష్టపడి చదివి ట్రిపుల్‌ ఐటిలో సీటు సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారని చెప్పారు. విద్యార్థి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ... పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థులు చదువుకునేందుకు ప్రోత్సహించారని తెలిపారు. ప్రత్యేక తరగతులు తీసుకొని విజయానికి తోడ్పాటునందించారని, కరస్పాండెంట్‌ మల్లేష్‌, ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మి సహకారం మరవలేనిదని చెప్పారు.