May 21,2023 01:13
ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న పట్టణ సిఐ పి కృష్ణయ్య

ప్రజాశక్తి-బాపట్ల రూరల్‌: వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు ట్రాఫిక్‌ నియమాలు తప్పక పాటించాలని బాపట్ల అర్బన్‌ సీఐ కృష్ణయ్య అన్నారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు శనివారం నో యాక్సి డెంట్‌ డే సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. పట్టణంలో ఆటో డ్రైవర్లు ఆటోలో అధిక సౌండ్‌తో పాటలు పెట్టడంతో ఆ స్పీకర్లను స్వాధీనం చేసుకొని ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వాహనాలు నడిపేటప్పుడు సీట్‌ బెల్ట్‌ ధరించాలని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలుంటాయని హెచ్చరించారు. ముఖ్యంగా బాడుగకు వెళ్లే డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించా లి. క్షేమంగా గమ్యం చేరేలా పని చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుధాకర్‌, వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంతమాగులూరు: హెల్మెట్‌ లేకుండా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని, సిఐ కే ప్రభాకర్‌ తెలిపారు. శనివారం నో యాక్సిడెంట్‌డే సందర్భంగా, జిల్లా ఎస్‌పి వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు కొమ్మాలపాడు, ఏల్చూరు, పుట్టావారిపాలెం జంక్షన్‌, సంత మాగులూరు గ్రామాల జంక్షన్‌లలో హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపేవారికి, మరియు వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు లేని వారికి, రాంగ్‌ రోడ్డుపై వాహనాలు నడిపే వారికి, ఈ చలానా విధించి వారి చేత కట్టించినట్లు తెలిపారు. అదేవిధంగా రహదారులపై యాక్సిడెంట్‌ జరగకుండా ఉండటానికి డ్రమ్స్‌ ఏర్పాటు చేశారు. ఆ డ్రమ్స్‌పై రాత్రులందు కనపడటానికి రేడియం స్టిక్కరింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మహిళా పోలీసుల సహాయంతో కొమ్మాలపాడు గ్రామంలో ఉన్న మహిళలకు ప్రతి ఒక్కరికి దిశా యాప్‌ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.