ప్రజాశక్తి -పిఎం పాలెం : వాహనదారులందరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని పిఎం పాలెం ట్రాఫిక్ సిఐ టివి విజయకుమార్ పేర్కొన్నారు. మంగళవారం కార్ షెడ్డు కూడలి వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ మురళీకృష్ణతో కలిసి నిర్వహించారు. అనంతరం సిఐ విజయకుమార్ మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా వాహనాలు నడపకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆటోలో పరిమితికి మించి లోడింగ్, ట్రాఫిక్ రూల్స్, అక్రమ రవాణా, అక్రమ పార్కింగ్ పట్ల అవగాహన కల్పించి, రహదారి భద్రతా నియమాలు పాటించాలని కోరారు. అతివేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు మృత్యువాత పడడంతోపాటు ఎందరో క్షతగాత్రులవు తున్నారన్నారు. పరిమితి కన్నా వేగంగా వెళితే జరిమానాలు తప్పవన్నారు. వాహనదారులు ఖచ్చితంగా ధ్రువీకరణపత్రాలు కలిగి ఉండాలని సూచించారు.
తగరపువలస : ట్రాఫిక్ నిబంధనలపై స్థానిక ఆటో కార్మికులకు ట్రాఫిక్ ఎస్ఐ సిహెచ్.చిరంజీవి మంగళవారం అవగాహన కల్పించారు. ఖచ్చితంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుంటే ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు పాల్గొన్నారు.










