ప్రజాశక్తి-కాకినాడ రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ పోర్ట్ వాహనాలపై భారీగా విధిస్తున్న రోడ్ ట్యాక్స్ను తగ్గించాలని, డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కాకినాడ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు) డిమాండ్ చేసింది. శుక్రవారం సిఐటియు జిల్లా కార్యాలయమైన పి.లక్ష్మీదాస్ భవన్లో యూనియన్ వార్షిక జనరల్ బాడీ సమావేశం వాలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి పి.రాజా రమేష్ గత కార్యక్రమాల నివేదికను, కోశాధికారి కె. సత్తిబాబు జమాఖర్చుల నివేదిక ప్రవేశ పెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశంలో సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు, జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ మాట్లాడారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా వాలిశెట్టి శ్రీనివాస్, కార్యదర్శిగా పి.రాజా రమేష్, కోశాధికారిగా కె.సత్తిబాబు, ఉపాధ్యక్షునిగా కర్రి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా బాషాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో రాఘవ, కృష్ణ, బద్రి, వీరు, రెడ్డి, సురేష్, రామకృష్ణ, రాంబాబు, హేమకుమార్, ఆంజనేయులు, రమణ, అర్జున్, శేఖర్, శేషు, సత్తిబాబు, రాజు పాల్గొన్నారు.










