Nov 02,2023 21:11

సమావేశంలో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఆదోని
తప్పుల్లేని ఓటరు జాబితా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని ఆదోని ఎన్నికల అధికారి, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ కోరారు. ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించి పొరపాట్లు ఉంటే తెలపాలని అన్నారు. గురువారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతనెల 27న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించినట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి, ఏమైనా తప్పులు, పొరపాట్లు జరిగి ఉంటే సంబంధిత ఎఇఆర్‌ఒ, ఇఆర్‌ఒ, బిఎల్‌ఒ లేదా ఆదోని ఎన్నికల అధికారికి సంబంధిత ఫారంలో డిసెంబర్‌ 9లోపు అందజేయాలన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని తెలిపారు. చనిపోయినా లేదా శాశ్వతంగా వేరే ప్రదేశానికి మారినా వారి ఓట్లు తొలగించడానికి ప్రత్యేక ఫారాలను విడివిడిగా ఇవ్వాలని చెప్పారు. వచ్చే జనవరి 5న ఓటరు జాబితా ప్రచురిస్తామని తెలిపారు. స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌లో భాగంగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఈనెల 4, 5న, డిసెంబర్‌ 2, 3న ఓటరు నమోదు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కొత్తగా ఓటర్లు ఆన్‌లైన్‌ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. తహశీల్దార్‌ వెంకటలక్ష్మి, డిప్యూటీ తహశీల్దార్లు రజినీకాంత్‌ రెడ్డి, ఇజాజ్‌ అహ్మద్‌, మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ అనుపమ, కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప, ఎంపిడిఒ కార్యాలయ పరిపాలన అధికారి విజయ శేఖర్‌ ఉన్నారు.