తొలగించిన వారికి ఉపాధి చూపండి : సిఐటియు
కలెక్టర్కు వినతి
ప్రజాశక్తి- తిరుపతి టౌన్
ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో రుయా ఆసుపత్రిలో విధులు నిర్వహించిన కార్మికులను ఏకపక్షంగా గతంలో తొలగించారని వారికి ఉపాధి కల్పించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు బాధితులు గురువారం వినతిపత్రం సమర్పించారు. 2018 - 2021వ సంవత్సరాల కాలంలో నక్షత్ర ఏజెన్సీలో ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా 30 మందికి పైగా కార్మికులు విధులు నిర్వహించారని, రాష్ట్ర ప్రభుత్వం అకారణంగా పలువురిని ఉద్యోగాల నుంచి నిలిపివేసిందని అవకాశం ఉన్నప్పుడు తొలగించిన వారికి ప్రాధాన్యతనిస్తామని నాడు ప్రకటించారని, బాధితులు కలెక్టర్ కు తెలియజేశారు. ప్రస్తుతం రుయాలో పని భారం కారణంగా ఉద్యోగులను తీసుకుంటున్నారని ఆ స్థానంలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు కలెక్టర్ కు విన్నవించారు. రుయా ఆసుపత్రి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తొలగించిన వారిని తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట్రమణారెడ్డి బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి. నాగరాజు, విజయానంద్, సుబ్రహ్మణ్యం, బాపూజీ నాయక్, శంకర్రావు, రెడ్డి ప్రసాద్, సుబ్రహ్మణ్యం, కిరణ్ కుమార్, పురుషోత్తం, నాగరాజు పాల్గొన్నారు.
సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి










