Aug 01,2021 15:50

గజియాబాద్‌ : అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తనకే శత్రువులా మారుతుందని ఆ తండ్రి ఊహిచలేకపోయాడు. ఆమెకు 11 ఏళ్ల వయసే.. చేసిన పని మాత్రం సినిమాల్లోని క్రైమ్‌ సీన్‌ను తలపిస్తోంది. ఏకంగా ఓ కిడ్నాప్‌ కథనే అల్లి తండ్రి నుంచి రూ.కోటి డిమాండ్‌ చేసింది. చివరికి పోలీసులు రంగప్రవేశం చేయడంతో అసలు విషయం తెలిసి పోలీసులు, చుట్టుపక్క వారు, బంధువులు అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గజియాబాద్‌ శాలిమార్‌ గార్డెన్‌ ఏరియాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారికి 11 ఏళ్ల బాలిక ఉంది. అయితే, తల్లిదండ్రులు ఆ బాలికను మందలించారు. దీంతో ఆ బాలిక మనస్తాపానికి గురైంది. అంతే.. తండ్రినే బెదిరించి డబ్బు డిమాండ్‌ చేయడానికి నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తండ్రి ల్యాప్‌టాప్‌ నుంచే రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సందేశం పంపింది. లేదంటే ఆయన కుమారుడు, కుమార్తెను చంపేస్తానని బెదిరించింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ సందేశం అతని ఇంట్లో నుంచే వచ్చిందని గుర్తించారు. అసలు విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు, పోలీసులు కంగుతిన్నారు. తల్లిదండ్రులు తనను తిట్టడం వల్లే ఈ పని చేసినట్లు బాలిక అంగీకరించింది.