Aug 03,2023 00:30

టమాట.. మున్నాళ్ల ముచ్చట..

ప్రజాశక్తి - చిలకలూరిపేట : సబ్సిడీపై టమాటాల సరఫరా మూన్నాళ్ల ముచ్చట కావడంతో ప్రజలు మళ్లీ అధిక ధరలకు కొనాల్సి వస్తోంది. టమాటా రూ.220 తోపాటు కోడిగుడ్డు రూ.10, పచ్చి మిర్చి రూ.130 పలుకుతున్నాయి. మార్కెట్లు, మాల్స్‌ నుండి ఇవి వీధులు, చిరు దుకాణాల్లో విక్రయాలకు వచ్చేసరికి ఇంకాస్త పెరుగుతున్నాయి. గతంలో రూ.20-30 వరకున్న కూరగాయల ధరలు ఇప్పుడు రూ.60-80 పలుకుతున్నాయి. చివరికి 130 గ్రాముల పెరుగు ప్యాకెట్‌ ధర రూ.12కు అమ్ముతున్నారు. గత నెల రోజుమార్చి రోజు ఐదురోజుల పాటు 58 క్వింటాళ్లను స్థానిక రైతు బజారుకు సరఫరా చేయగా ప్రజలు పెద్దపెద్ద లైన్లలో నిలబడి కొన్నారు. ఇప్పుడు వాటినీ నాణ్యత లేదనే పేరుతో నిలిపేయడంతో ఇతర వ్యాపారులు ధర మరింత పెంచి అమ్ముతున్నారు. సాధారణంగా ప్రతిరోజూ 30 క్వింటాళ్ల వరకూ టమాటాలు చిలకలూరిపేట పట్టణంలో అమ్ముడవుతాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించాలని, లేదా సబ్సిడీకి అయినా ప్రభుత్వం సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.