Nov 04,2023 17:21

రద్దీగా ఉన్న రోడ్డు

ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో రోజురోజుకు రోడ్లు ఇరుకుగా మారుతున్నాయి. వాహనాలు ఉపయోగించే వారి సంఖ్య పెరగడంతో దార్లన్నీ రద్దీ అవుతున్నాయి. పట్టణంలోని మున్సిపల్‌ రోడ్డు, పండిట్‌ నెహ్రూ రోడ్డు, గీతా మార్కెట్‌ ప్రాంతాలు ఎప్పుడూ రద్దీగా ఉంటున్నాయి. దుకాణాల ముందు వాహనాలు నిలుపుకునేందుకు ఫుట్‌ పాత్‌ సదుపాయం లేదు. జనం రద్దీగా ఉంటున్న ఈ రోడ్లలో రాకపోకలు తలనొప్పిగా ఉందని వాహనదారులు చెబుతున్నారు. శ్రీనివాస భవన్‌, బాబా ప్లాజా, పెద్ద మసీదు, పెద్ద మార్కెట్‌, దాదా కూల్‌ డ్రింక్‌ షాపు, జిబి కాంప్లెక్స్‌ ప్రాంతాల్లో ఎప్పుడూ వాహనాలు అడ్డదిడ్డంగా నిలవడం వల్ల బైక్‌ వెళ్లేందుకు కూడా అవకాశం లేని పరిస్థితి ఉందని పలువురు చెబుతున్నారు.
వన్‌ వే మరిచారు: పట్టణంలోని మంగళ క్లాత్‌ స్టోర్‌ నుంచి షరాఫ్‌ బజార్‌ వరకు, శ్రీనివాస భవన్‌ నుంచి వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ వరకు గతంలో వన్‌వే అమలులో ఉండేది. ప్రస్తుతం ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలను గాలికి వదిలేయడంతో రోడ్డు ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది. బళ్లారి, రాయచూరు, సిరుగుప్ప ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాలు శ్రీనివాస్‌ భవన్‌ రోడ్డు గుండానే కొత్త బ్రిడ్జి మీదుగా వెళ్లాల్సి ఉంది. భారీ వాహనాలు వచ్చినప్పుడు శ్రీనివాస్‌ భవన్‌ రోడ్డు ఇరుకుగా ఏర్పడి గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోతున్న పరిస్థితి ఉంది. అధికారులు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని పురవాసులు కోరుతున్నారు.
నెరవేరని సీఎం హామీ : గతేడాది జులై మాసంలో ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామీ నెరవేరలేదని పురవాసులు చెబుతున్నారు. ఆదోనిలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు రోడ్లు ఆధునీకరిస్తామని ప్రకటించారు. పట్టణం వీధులు విస్తరిస్తాయని అందరూ భావించారు. అక్రమ కట్టడాలు, రోడ్ల కోసం రూ.53 కోట్లు కేటాయిస్తామని బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. మున్సిపల్‌ రోడ్డు నుంచి గణేష్‌ సర్కిల్‌ వరకు, అక్కడి నుంచి పెద్ద మసీదు మీదుగా మున్సిపల్‌ రోడ్డు వరకు అక్రమ కట్టడాలు కూల్చాల్సి ఉంది. అధికారులు కొలతలు వేసి సుమారు 2.5 కిలోమీటర్లు రోడ్డు ఇరువైపులా తొలగించాలని, అందుకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వానికి నివేదించారు. ముఖ్యమంత్రి ప్రకటన కార్యరూపం దాల్చకపోవడంతో ప్రాధాన్యత కోల్పోతున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదోనిలో పండిట్‌ నెహ్రూ రోడ్డు, మున్సిపల్‌ రోడ్డు వెడల్పు చేసి ట్రాఫిక్‌ ససమ్య లేకుండా చూడాలని పట్టణ వాసులు కోరుతున్నారు.