ప్రజాశక్తి- ఆమదాలవలస: టిడిపి ప్రకటించిన మేనిఫోస్టో, మహాశక్తి పథకాలతోనే మహిళల అభివృద్ధి సాధ్యమని జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. మండలంలోని రామచంద్రపురంలో మహాశక్తి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో చేతకాని వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉందని మండిపడ్డారు. శ్రీకాకుళం - ఆమదాలవలస రహదారిని నిర్మించుకోలేని నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. అనంతరం టిడిపి మేనిఫోస్టో పోస్టర్లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తమ్మినేని గీత, సనపల ఢిల్లేశ్వరరావు, ఎంపిటిసిలు అన్నెపు భాస్కరరావు, గొర్లె సూర్యం, సర్పంచ్ బొడ్డేపల్లి గౌరీపతి, సనపల చెల్లంనాయుడు, ఇప్పిలి సత్యం, రమణమ్మ, సూర్యారావు పాల్గొన్నారు.
ఓటమి భయంతోనే చంద్రబాబుపై ఆరోపణలు
పొందూరు : సర్వేల్లో టిడిపికి అనుకూలంగా వస్తుండడంతో వైసిపిలో ఓటమి భయం పట్టుకుందని, అందుకే చంద్రబాబుపై వైసిపి నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని టిడిపి కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మద్యం, ఇసుక మైనింగ్ల్లో భారీ అవినీతిలో కూరుకుపోయిన సిఎం జగన్, నాయకులు... ఆ విషయం నుంచి దృష్టి మరల్చేందుకే చంద్రబాబు, లోకేష్లపైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తప్పుడు దారిలో గెలవుడానికే బిఎల్ఒలపై ఒత్తిడి తీసుకువచ్చి ఓటర్ లిస్టుస్టుల్లో టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈయనతో పాటు జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బలగ శంకరబాస్కర్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు బాడన శేషగిరినాయుడు ఉన్నారు.










