Oct 28,2023 00:42

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

ప్రజాశక్తి-చింతపల్లి: తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ అని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జ్‌, మాజీ శాసనసభ్యురాలు గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సమావేశమైన ఆమె మాట్లాడుతూ, ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి గడచిన నాలుగేళ్లుగా ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు. నిరంకుశ, కక్షపూరిత ధోరణితో ప్రతిపక్షాల గొంతు నొక్కడమే వైకాపా ప్రభుత్వం పరిపాలన సాగుతుందన్నారు. నిరాధారమైన ఆరోపణలతో కక్ష పూరితంగా తెదేపా జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును అన్యాయంగా అరెస్టు చేసిందని విమర్శించారు.రాబోవు సార్వత్రిక ఎన్నికలలో వైకాపాను ఇంటికి సాగనంపేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని ఆమె జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అరకు పార్లమెంట్‌ బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం, చింతపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్‌, నాయకులు భీమన్న, మంగు, రమణ, ప్రహ్లాదు పాల్గొన్నారు.