టిడిపిలోనే ఎస్సిలకు సముచిత స్థానం
ప్రజాశక్తి-వరికుంటపాడు : టిడిపి అధికారంలోకి వస్తేనే ఎస్సిలకు ఇతరులతో సమానమైన న్యాయం చేకూరుతుందని మాజీ ఎంఎల్ఎ బొల్లినేని వెంకటరామారావు పేర్కొన్నారు. కలిగిరి క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎస్సిల ఆత్మీయ సమావేశానికి వరికుంటపాడు మండలం నుంచి ఎస్సిసెల్ అధ్యక్షులు తాతపూడి లాభాన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సిలకు సముచిత న్యాయం టిడిపితోనే సాధ్యమవుతుందన్నారు. 2024 ఎన్నికల్లో టిడిపి గెలుపునకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి ఉదయగిరి కోటపై టిడిపి జెండాను రెపరెపలాడించాలన్నారు. అందుకు ఎస్సిలు ముందుండి నడిపించి వారి సత్తా ఏమిటో నిరూపిస్తామని ఎస్సిసెల్ అధ్యక్షుడు తాతపూడి లాభాన్, ఎస్సిల తరఫున ఆయనకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి నందిపాటి ఆరోను, ఎస్సిసెల్ సీనియర్ నాయకులు నూనె ప్రసాద, ఎస్సిసెల్ ప్రధాన కార్యదర్శి కొనిగిపోగు వెంగయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










