
ప్రజాశక్తి-మాడుగుల:ఉత్తమ సేవలకు గాను గణతంత్ర దినోత్సవ వేడుకలలో మాడుగుల తహసిల్దార్ పీవీ రత్నం అవార్డు పొందిన వెనువెంటనే మరో అవార్డు సొంతం చేసుకున్నారు. భూ రీ సర్వే పనులు, ఇతర సేవలలో మంచి ఫలితాలు రాణిస్తున్న ఆయన మరోసారి జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టి చేతుల మీదుగా గురువారం అవార్డు అందుకున్నారు. గత ఏడాది విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి బదిలీపై మాడుగుల తహసిల్దారుగా విధుల్లో చేరిన ఆయన అప్పటి నుండి, వివాదరహితుడిగా పేరు తెచ్చుకొని రెవెన్యూ సేవలు అందించడంలో మన్ననలు పొందారు. ఇటీవల కాలంలో భూ సర్వే విషయంలో సర్వేయర్లు, వీఆర్వోలు ఇతర సిబ్బందికి అనేక సూచనలు జారీ చేస్తూ సక్రమంగా సర్వే పనులు పూర్తి అయ్యేలా సహకరించారు. ఒక సందర్భంలో అల్పాహారం, భోజనాలకు ఇబ్బంది అవుతుందని గమనించి, సమయ జాప్యం జరగకుండా ఆయనే సిబ్బందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరోసారి ఉత్తమ సేవలకు గాను అవార్డు లభించింది. మండలంలోని పలువురు తహసిల్దార్ కు అభినందనలు తెలిపారు.