
ప్రజాశక్తి-పాడేరు:పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో పదికి పది గ్రేడ్ పాయింట్లు సాధించడమే లక్ష్యంగా క్రమ శిక్షణతో విద్యార్థులు చదువుకోవాలని ఐటిడిఏ పీఓ వి.అభిషేక్ సూచించారు. జీవితంలో ఎదగడానికి ఉన్నతంగా చదువుకోవాలని సూచించారు. బాగా చదువుకుని ఐటిడిఏకు, గిరిజన ప్రాంతానికి మంచి పేరు తీసుకుని రావాలన్నారు. గుత్తులపుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, దిగుమోదా పుట్టు ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 52 మంది పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక బోధనా తరగతులను ' గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ, గుత్తులపుట్టు ఆశ్రమ పాఠశాలలో 32 మంది బాలికలకు, దిగుమోదాపుట్టు ఆశ్రమ పాఠశాలలో 20 మంది బాలురకు ప్రత్యేక బోధనా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక బోధనకు ఎంపికైన విద్యార్థులకు మంచి వసతి, అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాలు భోధిస్తామని, గిరిజన విద్యార్థులు ప్రత్యేక తరగతులు సద్వినియోగం చేసుకుని ఉత్తమ ర్యాంకులు సాధించాలని చెప్పారు. గిరిజన విద్యార్థులలో అపారమైన ప్రతిభా సామర్ధ్యాలు ఉన్నాయని చెప్పారు. ఉత్తమ పాయింట్లు సాధించి మారిక వలస కాలేజ్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ప్రవేశం పొందాలని చెప్పారు. కాలేజ్ ఆఫ్ ఎక్స్ లెన్స్లో నీట్, ఐఐఐటి, లాసెట్ ప్రవేశాలకు ఉత్తమ శిక్షణ అందిస్తున్నారని చెప్పారు. విద్యార్ధులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తే సంబంధిత సబ్జెక్టు టీచర్లకు ఐటిడిఏ నుండి రివార్డులు అందిస్తామని చెప్పారు. ప్రతీ విద్యార్థికి 20 నోట్స్ పుస్తకాలను పంపిణీ చేసారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లాటరీ విధానంలో పదవ తరగతి విద్యార్ధులను ఉపాధ్యాయులు దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, ఎటిడబ్ల్యూ ఎల్.రజని, ప్రధానోపాధ్యాయులు రాజ్యలక్ష్మి, గంగా భవాని, మంజుల, ఆర్.దర్మన్న, రీమిలి జాస్, ప్రసాద్, శ్రీనివాస పడాల్ పాల్గొన్నారు.