ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడ జిల్లాకు చెందిన వర్ధమాన టెన్నిస్ క్రీడాకారుడు పెనుపోతుల లక్ష్మి సాయి సుభాష్కు అంతర్జాతీయ స్థాయి శిక్షణ కోసం అరబిందో ఫార్మ ఫౌండేషన్ రూ. 6 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఉప్పాడ కొత్తపల్లి మండలం యండపల్లి గ్రామానికి చెందిన సుభాష్ ఆంధ్ర ప్రదేశ్ అండర్ -18 నేషనల్ టెన్నిస్ ప్లేయర్గా ఉన్నారు. ప్రస్తుతం ఇండియాలో 98వ ర్యాంక్లో కొనసాగుతున్న సుభాష్ జాతీయ స్థాయిలో వివిధ పోటీలలో ప్రతిభకనబరచి ఎన్నో మెడల్స్ సాధించారు. సుభాష్ అంతర్జాతీయ స్థాయి ఆటకు అవసరమైన మెళకువల్లో శిక్షణ పొందడానికి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించని కారణంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారం కోరారు. కాకినాడ ఎంపి వంగా గీత, కాకినాడ సెజ్ ప్రాజెక్ట్ హెడ్ జి.సీతారామయ్య సోమవారం కాకినాడలోని ఎంపి కార్యాలయంలో ఈ నగదు సహా యాన్ని పి.లక్ష్మి సాయి సుభాష్ తండ్రికి అందజేశారు. సెజ్ పరిధిలో విద్య, వైద్యానికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఎంపి అభినందించారు. తాము కోరిన వెంటనే, ఒక గ్రామీణ క్రీడాకారుని శిక్షణ కోసం పెద్దమొత్తంలో సాయం చేస్తు న్నందుకు అరబిందో ఫార్మా డైరెక్టర్లు నిత్యానందరెడ్డి, శరత్ చంద్రారెడ్డిలకు సుభాష్ కుటుంబసభ్యులు కృతజ్ఞలు తెలియచేశారు.
ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్న ఎంపి గీత అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులు










