Feb 06,2023 23:54

కె.విశ్వనాథ్‌, జమున చిత్రపటాల వద్ద నివాళులర్పిస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి-సీతమ్మధార : తెలుగు తొలి సినిమా భక్త ప్రహ్లాద 1932 ఫిబ్రవరి 6న విడుదల అయి నేటికీ 91ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ ఆధ్వర్యాన మూడు రోజుల పాటు తెలుగు సినిమా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వైజాగ్‌ ఫిలిం సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాశరావు తెలిపారు. ఈ ఉత్సవాన్ని పౌర గ్రంథాలయంలో దర్శకుడు విఎన్‌ ఆదిత్య సోమవారం ప్రారంభించారు. తొలుత కె.విశ్వనాథ్‌, జమున ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దర్శకుడు ఆదిత్య మాట్లాడుతూ, మానవ విలువలను స్పృశించే సినిమాలను ప్రజలకు చేరువ కావాలని వైజ్‌ా ఫిల్మ్‌ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. విశాఖ ఫిల్మ్‌ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం స్పందించి చొరవ తీసుకోవాలని, సినీ ప్రేక్షకులు ఒక కమిటీగా ఏర్పడి పాలకులపై ఒత్తిడి తేవాలని సూచించారు. తాను ఇక్కడే చదువుకున్నానని, విశాఖపై పూర్తి అవగాహన ఉండటంతో తన చిత్రాలను ఎక్కువగా ఇక్కడే తీస్తుంటానని తెలిపారు.
పారిశ్రామికవేత్త భరణికాన రామారావు మాట్లాడుతూ, ప్రజలు మంచి సినిమాలు చూసే అలవాటు చేసుకోవాలన్నారు. సొసైటీ ఆధ్వర్యాన ప్రదర్శిస్తున్న చిత్రాలను తిలకించాలని కోరారు. అనంతరం కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొంది జమున నటించిన ఉండమ్మా బొట్టు పెడతా చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైజాగ్‌ ఫిల్మ్‌ సొసైటీ అధ్యక్షులు ఆచార్య ఎన్‌ఎడి పాల్‌, కార్యదర్శి, కాశీ విశ్వేశ్వరరావు, సుసర్ల శ్రీనివాస్‌, బి.చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు విఎన్‌.ఆదిత్యతో ఫిల్మ్‌ మేకింగ్‌ వర్క్‌ షాప్‌, సాయంత్రం 5.30 గంటలకు గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన 1938 మాల పిల్ల ప్రదర్శన ఉంటాయని కార్యనిర్వాక సభ్యులు తెలిపారు. విశాఖపట్నం ప్రజలు ఉచితంగా తిలకించవచ్చని పేర్కొన్నారు.