ప్రజాశక్తి - పెదనందిపాడు రూరల్ : శ్రీలావు వెంకటేశ్వర్లు, కల్లూరి నాగేశ్వరరావు కళాపరిషత్ తెలుగు రాష్ట్రాల సప్తమ ఆహ్వాన నాటిక పోటీలు మంగళవారం రాత్రి వరగానిలోని చల్లా నాగరాజు కళా ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. అనంతపురం లలిత కళా పరిషత్ అధ్యక్షులు గాజులు పద్మజ జ్యోతి ప్రజ్వలన ప్రదర్శనలను ప్రారంభించారు. తొలిగా అరవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి 'వెండి అంచులు' నాటికను ప్రదర్శించారు. ఆస్తులు, డబ్బులు నేపథ్యంలో వయసు సంబంధం లేకుండా చేసే పెళ్లిళ్ల వలన జరిగే అనర్ధాలను నాటిక ద్వారా ప్రదర్శించారు. రెండవ నాటికిగా 'మృత్యుపత్రం', మూడవ నాటికగా కళాంజలి హైదరాబాద్ వారి 'రైతేరాజు'ను ప్రదర్శించారు. తొలుత గాజుల పద్మజకు పరస్కారాన్ని ప్రదానం చేసిన నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో యడ్లపాడు పుచ్చలపల్లి సుందరయ్య పరిషత్ నిర్వాహకులు ముత్తవరపు సురేష్బాబు, స్థానిక పరిషత్ గౌరవ అధ్యక్షులు మద్దన రాఘవయ్య, అధ్యక్షులు పోపూరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి, సినీ రచయిత చెరుకూరి సాంబశివరావు పాల్గొన్నారు.










