
వేలాద్రిపురాన్ని పరిపాలిస్తున్న రాజు కశ్యపవనుడు వినూత్న, విచిత్ర కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకట్టుకునేవారు. తానే తెలివైనవాడినని, మిగతా వారంతా ఎందుకూ పనికిరాని వారని రాజు భావించేవాడు. ఆయనకు ఒక విచిత్రమైన అలవాటు ఉంది. అది ఏమిటంటే ప్రతిరోజూ సభలో ఎవరో ఒకరు కథలు చెబుతూ ఉండాలి. అందుకోసం కొంత సమయం కేటాయించేవారు. రాజు కథలు వినడం ద్వారా ఆనందం పొందేవారు. అయితే ఆ సభలోని వారందరూ ప్రతిరోజూ చెప్పిన కథలే మరలా మరలా చెబుతూ ఉండేవారు. దాంతో విసుగు చెందిన రాజు 'రాజ్యంలో ఎవరైనా రాజు గారికి నచ్చే విధంగా కథలు చెబితే వారికి నూరు బంగారు నాణేలు బహుమానం కలదు' అని చాటింపు వేయించాడు.
విషయం తెలిసిన రాజ్యంలోని ప్రజలు నాణేల కోసం ఇష్టమొచ్చినట్లు కథలు చెప్పసాగారు. దాంతో మహారాజు ఇక లాభంలేదు అనుకుని 'ఎవరైతే రాజుగారికి నచ్చే విధంగా కథలు చెప్పరో.. వారికి గుండు గీయిస్తాం' అంటూ మరలా దండోరా వేయించారు. దాంతో కాలక్షేపానికి కథలు చెప్పేవారు తగ్గారు. నిజంగానే కథలు చెప్పేవారు రావడం మొదలైంది. తన రాజ్యంలో, ఇతర రాజ్యాలలో గల గొప్ప గొప్ప కవులు, రచయితలు రాజు వద్దకు వచ్చి కథలు చెప్పసాగారు. అయితే వారు చెప్పిన కథలు చాలా బాగున్నప్పటికీ రాజు కావాలని వాటిని నచ్చలేదన్నట్టు చూసేవారు. రాజుగారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో సభలోని వారికి అర్థమయ్యేది కాదు. ఒకరోజు ధైర్యం చేసి మహామంత్రి రాజుగారితో 'మహారాజా! మీరు ఎందుకు బాగున్న కథలూ బాగా లేవని అంటున్నారు? గొప్ప గొప్ప కవులు అందరూ గుండు చేయించుకొని, ఇంటిదారి పడుతున్నారు. ఇది మన రాజ్యానికి మంచిది కాదేమో ఒకసారి ఆలోచించండి!' అన్నాడు. 'మహామంత్రి! మీకు తెలీదు మీరు ఎక్కువగా ఆలోచించక మీ పని మీరు చేసుకోండి' అన్నాడు మహారాజు.
రాజుగారి రాజ్యానికి సమీప రాజ్యమైన శిలావర్తనంలో పూర్ణానందుడు అనే కవి, రచయిత ఉండేవాడు. ఆయన రాజుగారికి కథ చెబుదామని వేలాద్రిపురానికి చేరుకున్నాడు. రాజును కలిసి కథ చెప్పసాగాడు. కథ పూర్తవగానే రాజు నచ్చనట్లుగా ముఖం పెట్టాడు. ఏమి జరుగుతుందో విషయం అర్థం కాకపోయినా నియమం ప్రకారం గుండు గీయించుకుని, ఇంటి దారి పట్టాడు. కొంతకాలం తర్వాత మరలా ఇంకో కథతో రాజు వద్దకు వచ్చాడు పూర్ణనందుడు. ఆరోజునూ కథ చెప్పడం ప్రారంభించాడు. కానీ అదీ నచ్చనట్లుగా చూశారు రాజు. బాగున్న కథలనూ రాజు ఎందుకు బాగలేవని అంటున్నారనే విషయాన్ని ఆరా తీశాడు పూర్ణానందుడు. ఇతరుల గొప్పను మెచ్చుకునే స్వభావం రాజుగారికి లేదని గ్రహించాడు. అందుకే ఈసారి ఎలాగైనా కథ బాగుంది అని రాజే స్వయంగా అనాలి అని భావించి, ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. మరి కొంతకాలం గడిచిన తర్వాత మరో కథతో రాజు దగ్గరకు వచ్చాడు. 'ఈ కథ మీ వంశం గురించి మహారాజా!' అని కథ చెప్పడం ప్రారంభించాడు. ముందుగా రాజుగారి వంశం యొక్క ఘనతలు చెప్పసాగాడు. వింటున్న రాజు ముఖంలో గర్వం తొణికిసలాడింది. ఆ తర్వాత క్రమంగా రాజ వంశీయుల అపజయాలను చెప్పనారంభించాడు. వెంటనే రాజు 'చాలు చాలు కథ చాలా బాగుంది' అని నూరు బంగారు నాణేలు ఇచ్చి సన్మానించబోయాడు. 'క్షమించండి మహారాజా! లోకంలో చాలామంది మనకన్నా గొప్పవారు ఉంటారు. మనమే గొప్పవాళ్ళం అనుకోవటం మూర్ఖత్వం. మహారాజులు అయిన మీరు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి. నేనేగొప్ప అనుకోవడం అవివేకం. మీరు చాలా గొప్పవారు. ఇతరుల గొప్పను అంగీకరించకపోవడం మీలో ఉన్న దుర్గుణం. ఇది తొలగించుకుంటే మీ పూర్వీకులలాగా ఉన్నతస్థానంలో ఉంటారు. నేను మీకు చెప్పేటంత వాడిని కాదు, నన్ను మన్నించండి' అన్నాడు కవి. దాంతో మహారాజు 'కవి శ్రేష్ఠా! నువ్వు నాలోని అహంకారాన్ని పటాపంచలు చేశావు. నా తప్పును నాకు నిర్భయంగా చెప్పినందుకు ధన్యవాదాలు' అంటూ కవిని ఘనంగా సన్మానించాడు. ఇక ఆ తర్వాత నుండి రాజు ఎదుటివారిలోని గొప్పతనాన్ని మెచ్చుకోవడం ప్రారంభించాడు.
ఏడుకొండలు కళ్ళేపల్లి
94908 32338