Aug 02,2021 08:58

తాడిమర్రి : అడ్డుకుంటే ప్రాణాలు తీయిస్తా... అంటూ బిజెపి కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గంగులకుంట గోపాల్‌ రెడ్డి ఓ పేద రైతు కుటుంబంపై దౌర్జన్యం చేశారు. ఉన్నతాధికారులు తమను రక్షించాలంటూ.. ఆ పేద రైతు కుటుంబం తమ గోడును విలేకరుల ముందు వెళ్లబోసుకుంది. వివరాల్లోకెళితే... అనంతపురం జిల్లా తాడిమర్రి బిసి కాలనీకి చెందిన దేవర వెంకట్రాముడు, లక్ష్మీదేవి దంపతులకు తాడిమర్రి సర్వేనంబర్‌ 561లో 5.29 ఎకరాల పొలం ఉంది. బోర్లు వేసి వేరుశనగ సాగు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం 800 చీనీచెట్లు నాటుకున్నారు. వీరి పొలం పక్కనే బిజెపి నాయకుడు గోపాల్‌ రెడ్డి భూమి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక బోరు ఉంటే దానికి 200 అడుగుల దూరం పైన మరో బోరు వేయాల్సి ఉంటుంది. అయితే, గోపాల్‌ రెడ్డి 30 అడుగులలోపే బోరును వేసుకునేందుకు కొన్ని రోజుల క్రితం ప్రయత్నించాడు. అక్కడ బోరు వేస్తే తమ బోరులో నీరుపోతుందంటూ.. రైతు వెంకట్రాముడు కుటుంబం అడ్డుచెప్పింది. దీంతో గోపాల్‌ రెడ్డి వారిపై దౌర్జన్యానికి దిగాడు. ఒక బోరులో రాళ్లు వేశాడు, మరో బోరు, మీటర్‌ పెట్టెను ధ్వంసం చేశాడు. తన బోరును వేయనీయకుండా అడ్డుకుంటే మీ ప్రాణాలు తీయిస్తానంటూ బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధిత రైతు కుటుంబం ఆదివారం విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకొని కంటతడిపెట్టారు. తమకు గోపాల్‌ రెడ్డి నుంచి ప్రాణాపాయం ఉందని, ఉన్నతాధికారులు స్పందించి తమను రక్షించాలని బాధిత రైతు కుటుంబం వేడుకుంది.