
తైక్వాండోలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలి
- కర్నూలు స్పోర్ట్స్ హాస్టల్ తైక్వాండో కోచ్ కె.కార్తికేయన్
ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్
తైక్వాండో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలోనూ రాణించి పతకాలు సాధించాలని సాయి కర్నూలు స్పోర్ట్స్ హాస్టల్ తైక్వాండో కోచ్ కె.కార్తికేయన్ ఆకాంక్షించారు. కర్నూలు స్పోర్ట్స్ హాస్టల్ తైక్వాండో కోచ్గా కె.కార్తికేయన్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శనివారం కర్నూలు నగరంలోని అవుట్ డోర్ స్టేడియంలో ఆయనను తైక్వాండో కోచ్ జి.షబ్బీర్ హుస్సేన్ శాలువాతో ఘనంగా సన్మానించారు. జిల్లా స్థాయి పోటీలలో అండర్-17 బాలికల విభాగంలో డి.సుగంధిని, బాలుర విభాగంలో ఎస్.పవన్, డి.రేవంత్, అండర్-19 బాలికల విభాగంలో రాధిక బంగారు పతకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికైన క్రీడాకారులను కె.కార్తికేయన్, ప్రజాశక్తి హెడ్ ఆఫీస్ జనరల్ మేనేజర్ తిరుపాల్ రెడ్డి, కర్నూలు జనరల్ మేనేజర్ నరసింహా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆత్మరక్షణకు తైక్వాండో విద్య ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు. శారీరక, మానసిక ఒత్తిడికి లోను కాకుండా తోడ్పడుతుందని, విద్య, ఉద్యోగాలలో తోడ్పడుతుందని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మరెన్నో పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం క్రీడాకారులను, తైక్వాండో కోచ్ జి.షబ్బీర్ హుస్సేన్ను వారు అభినందించారు. కోచ్ జి.షబ్బీర్ హుస్సేన్ మాట్లాడుతూ కడప జిల్లా రైల్వే కోడూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 9, 10, 11వ తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలలో వీరు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో తైక్వాండో సీనియర్ క్రీడాకారుడు కపిల్, విద్యార్థుల తల్లిదండ్రులు డి.రాముడు తదితరులు పాల్గొన్నారు.
