Sep 22,2023 00:52

సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

- ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే
ప్రజాశక్తి-రంపచోడవరం

ఏజెన్సీలో ఉపాధి హామీ పనులు టార్గెట్‌ ప్రకారం చేయించాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశపు హాలు నుండి రంపచోడవరం. చింతూరు డివిజన్ల పరిధిలోని 11 మండలాలకు సంబంధించిన ఉపాధి హామీ పథకం అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్లు, ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో పిఒ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయితీ పరిధిలో ఎన్ని గ్రామాలలో ఉపాధి పనులు కల్పించింది, ఎంత మందికి జాబ్‌ కార్డులు ఉన్నవి, ఎంతమంది జనాభా ఉన్నదీ, సచివాలయల వారిగా ప్రాజెక్ట్‌ అధికారి ఆరా తీశారు. ఉపాధి హామీ లబ్ధిదారులకు బ్యాంక్‌ అకౌంట్లు తప్పనిసరిగా ఉండాలని, ఆధార్‌ అనుసంధానం చేయించాలని సూచించారు. గంగవరం మండలంలోని ముకాస భూములకు సంబంధించిన వివరాలు సమర్పించాలని సంబంధిత ఏపీఓను ప్రాజెక్ట్‌ అధికారి ఆదేశించారు. చింతూరు డివిజన్లోని నాలుగు మండలాలలో ఉపాధి హామీ పథకం పనులు చేయించడంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందికి ఈ నెల జీతం ఆపాలని ఏపీఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీడీలు రాంబాబు, భాగ్యరావు, ఉపేంద్ర, ఏపీవోలు సాయిబాబా, ప్రకాష్‌, సురేష్‌, రెడ్డి బాబు, ఎస్‌ఓ టి.మార్తమా, జి ఆనంద్‌, ఎపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.