Feb 10,2023 23:59

కప్‌ అందుకుటున్న క్రీడాకారులు

ప్రజాశక్తి-మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అఖిల భారత అంతర్‌ విశ్వవిద్యాలయాల టార్గెట్‌బాల్‌ పోటీల ఫైనల్స్‌లో ఆంధ్ర విశ్వవిద్యాలయం జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో గీతం విశ్వవిద్యాలయం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. దాదాపు దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 29 జట్లు ఈ పోటీలలో పాల్గొనగా ప్రారంభం నుంచి ఆంధ్ర, గీతం విశ్వవిద్యాలయం జట్లు ప్రతిభ చాటుతూ వరస విజయాలతో ముందుకు సాగాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం జట్టు రాజస్థాన్‌కు చెందిన ఒపిజెఎస్‌ యూనివర్సిటీ జట్టు పై 34-8 స్కోరుతో విజయాన్ని నమోదు చేయగా, ద్వితీయ స్థానం కోసం జరిగిన పోటీలో గీతం జట్టు ఉత్తరప్రదేశ్‌కు చెందిన జిఎల్‌ఎ యూనివర్సిటీ జట్టుపై15-9 స్కోరుతో విజయం సాధించి రన్నరప్‌గా నిలిచింది. ఒపిజెఎస్‌ యూనివర్సిటీ తృతీయ స్థానంలో, జిఎల్‌ఎ యూనివర్సిటీ నాలుగవ స్థానంలో నిలిచాయి. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్ర యూనివర్సిటీ క్రీడాకారుడు ఎమ్‌.ప్రణీత్‌ సుకుమార్‌ ఉత్తమ డైమండ్‌ క్రీడాకారుడుగా, గీతం క్రీడాకారుడు ఎస్‌.స్నేహిత్‌ ఉత్తమ షూటర్‌గా పతకాలను అందుకున్నారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి గీతం కార్యదర్శి ఎమ్‌.భరద్వాజ, గీతం ప్రోవైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు, భారతీయ టార్గెట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సోనూశర్మ, గీతం క్రీడా విభాగం డైరక్టర్‌ అరుణ్‌కార్తిక్‌, డిప్యూటీ డైరక్టర్‌ శ్రీనివాస్‌ హజరై విజేతలను అభినందించారు.