తాగునీటి సమస్యను పరిష్కరించండి : సిపిఎం
ప్రజాశక్తి - కోసిగి రూరల్
చిన్న బొంపల్లి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం మండల కన్వీనర్ కె. రాముడు అన్నారు. గురువారం సిపిఎం ఆధ్వర్యంలో చిన్న బొంపల్లి పంచాయతీ కార్యాల యం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కన్వీనర్ రాముడు మాట్లాడుతూ చిన్న బొంపల్లి గ్రామంలో ఒకే నీటి ట్యాంకు ద్వారా మాత్రమే గ్రామ ప్రజలందరికీ తాగునీరు అందించడం వల్ల ప్రజలు తాగునీటి కోసం కూలీ పనులు వదులుకొని పడి కాపులు కావలసిన పరిస్థితి నెలకొని ఉందని ఆయన అన్నారు. గ్రామంలో నాలుగు నీళ్లు ట్యాంకులు వృధాగా ఉన్న వాటికి నీటి సరఫరా అధికారులు చేయడం లేదని ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఫలితం లేకపోయిందని ఆయన అన్నారు. అంతేకాకుండా డ్రైనేజ్ కాలువలు శుభ్రం పరచడం లేదని డ్రైనేజ్ కాలువలో చెత్తాచెదారం పూడిక పేరుకుపోయి దుర్వాసన వస్తుందని దీనివల్ల ప్రజలు అనారోగ్యనికి గురికావాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద బొంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో సిసి రోడ్లు లేవని అదేవిధంగా పెద్ద బొంపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్డు నందు డ్రైనేజీ కాలువలు నిర్మించాలని ఆయన కోరారు. చిన్న బొంపల్లి గ్రామంలో గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు గత పది నెలల నుండి జీతాలు లేవని కార్మికులకు జీతాలు వెంటనే ఇవ్వాలని ఆయన కోరారు. రెండు గ్రామాల్లో వీధిలైట్లు లేని చోట్ల వీధిలైట్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వెల్ఫేర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శాంతిరాణిలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం,కెవిపిఎస్ నాయకులు రామకోటి హనుమంతు, ముక్కరన్న, యాకూబ్, వెంకోబ, హుసేని తదితరులు పాల్గొన్నారు.










