ప్రజాశక్తి - హోళగుంద
మండలంలోని ముద్దాటమాగి గ్రామం ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్లో ఎస్సీ కాలనీ వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాలనీలో దాదాపు 20 ఎస్సీ కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. తమకు ఒక్క పబ్లిక్ కుళాయి కూడా పంచాయతీ కార్యదర్శి, సర్పంచి ఏర్పాటు చేయకపోవడం బాధాకరమన్నారు. వాడుకోవడానికి నీరు తెచ్చుకోవాలంటే 600 మీటర్ల వరకు వెళ్లి ట్యాంకు దగ్గర తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తమ సమస్యను పలుమార్లు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కాలేదంటే నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. సబ్ ప్లాన్ నిధుల ద్వారా ఆర్డబ్ల్యుఎస్ అధికారులతో మాట్లాడి పైపులైన్ వేయించాలని ఎంపిడిఒ దాసును కోరారు.
తాగునీటి సమస్యను పరిష్కరించండి










