ప్రజాశక్తి - ఆదోని
పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య రానివ్వబోమని, అధికారులతో కలిసి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు. పట్టణానికి తాగునీరందించే బసాపురం ఎస్ఎస్ ట్యాంకు వద్ద జరుగుతున్న ఇసుక బండ్ పనులను గురువారం మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ట్యాంకు బండ్ కుంగిపోవడంతో నీరు నిలువ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా సుమారు రూ.కోటితో ఇసుక బండ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంకా ఎక్కువ మంది కూలీలను నియమించి త్వరగా పనులను పూర్తి చేసి ట్యాంకులో నీటిని నింపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ట్యాంకును మరింత పరిశిష్టంగా నిర్మించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. వేసవి నాటికి అన్ని పనులూ పూర్తి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం అమృత్ పథకం కింద పనులు చేసేందుకు రూ.20 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం తుంగభద్ర దిగువ కాలువ నుంచి రెండు మోటార్లతో ఎస్ఎస్ ట్యాంకులో తాగునీటి నిల్వ చేస్తున్నామని వివరించారు. అధికారులు మరింత కష్టపడి పనిచేసి తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు రాజశేఖర్ రెడ్డి, వైసిపి నాయకులు చంద్రకాంత్ రెడ్డి ఉన్నారు.
పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే