ప్రజాశక్తి-గుత్తి తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి ఆర్ఎస్ లో మహిళలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. 6, 7వ వార్డులకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో పత్తికొండ రోడ్డు కూడలికి చేరుకుని వాహనాల రాకపోకలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. అనంతరం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ నెలల తరబడి తాగునీటిని సరఫరా చేయకపోతే బతకాలని ప్రశ్నించారు. దాదాపు రెండు నెలలుగా తమవార్డులకు నీరు సరఫరా కావడం లేదన్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం తాము అనేక అవస్థలు పడుతున్నామని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. కొళాయిల ద్వారా తాగునీటిని సక్రమంగా సరఫరా చేయని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఖాళీ బిందెలతో రాస్తారోకో చేస్తున్న మహిళలు










