Jul 24,2023 18:05

గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తున్న మురళి

ప్రజాశక్తి - సత్తెనపల్లి రూరల్‌ : నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుండి తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీల నీటిని విడుదల చేశారని, గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌ పరిధిలో ఉన్న తాగునీటి చెరువులను నింపుకోవాలని ఎన్‌ఎస్‌పి ఇఇ ఎం.మురళి విజ్ఞప్తి చేశారు. నకరికల్లు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌కు ఆయన నీటిని సోమవారం విడుదల చేశారు. ఈ నీటిని గ్రామీణ నీటి సరఫరా విభాగం, ప్రజారోగ్య శాఖ అధికారులు వారి పరిధిలోని తాగునీటి చెరువులకు పెట్టించాలని చెప్పారు. సత్తెనపల్లి, నర్సరావుపేట, చిలకలూరిపేట మున్సిపాలిటీలకు తాగునీటి అవసరాల నిమిత్తం మంగళవారం నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు.