Jun 17,2023 20:40

మరమ్మతులు చేయిస్తున్న ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ సాయికుమార్‌

ప్రజాశక్తి - పెద్దకడుబూరు
మండలంలోని పెద్దకడబూరు గ్రామంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు రక్షిత మంచినీరందించడమే లక్ష్యమని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ సాయికుమార్‌ తెలిపారు. శనివారం పెద్దకడుబూరులోని నాగిరెడ్డి చెరువు, శ్రీరామలింగేశ్వర స్వామి చెరువుల్లో ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంకులకు వద్ద ఫిల్టర్‌ బెల్ట్‌ మరమ్మతులు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్‌ఎస్‌ ట్యాంకులకు వద్ద ఫిల్టర్‌ బెడ్డును జడ్‌పిటిసి నిధులు రూ.2 లక్షల వ్యయంతో మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే నౌలేకల్‌లో రూ.లక్ష, పెద్దకడబూరులోని లక్ష్మీపేట ఎస్సీ కాలనీలో రూ.లక్ష చొప్పున జడ్‌పిటిసి నిధులతో పైపులైన్‌ నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు. వైసిపి మండల కన్వీనర్‌ రామ్మోహన్‌ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ రెడ్డి, వైసిపి నాయకులు రవిచంద్ర రెడ్డి, మాజీ సర్పంచి సత్యనారాయణ గౌడ్‌, కల్లుకుంట డీలర్‌ నర్సింగప్ప, ఉచ్చప్ప, విజరు కుమార్‌ పాల్గొన్నారు.