
* ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సూటిప్రశ్నలు
న్యూఢిల్లీ : ఏళ్ల తరబడి ట్రిబ్యునల్స్లో ఖాళీలను భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ''ట్రిబ్యునల్స్ను కొనసాగించాలనుకుంటున్నారా లేదా మూసివేసే ఉద్దేశంతో ఉన్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న. ఈ ట్రిబ్యునళ్లకు బ్యూరోక్రసీ అవసరం లేదా?'' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ట్రిబ్యునల్స్ నిర్వీర్యమయితే.. ట్రిబ్యునల్స్ అమలు చేసే చట్టపరమైన ప్రాంతాలపై హైకోర్టులకు అధికారం లేని సమయంలో న్యాయం కోసం ఫిర్యాదుదారులు ఎక్కడకు వెళ్లాలని జస్టిస్ సూర్యకాంత్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. '' మీరు ట్రిబ్యునల్స్ అవసరం లేదనుకుంటే.. వారి అధికార పరిధిని హైకోర్టులకు బదిలీ చేసేందుకు అనుమతించండి. లేదా ట్రిబ్యునల్స్ను కొనసాగించాలనుకుంటే ఖాళీలను భర్తీ చేయండి. న్యాయం పొందే ప్రజల హక్కును మీరు నిరాకరించలేరు'' అని స్పష్టంగా చెప్పారు. కీలకమైన ట్రిబ్యునళ్లలో ఉన్న 200 ఖాళీలకు పైగా వివరాలను చీఫ్ జస్టిస్ రమణ చదివి వినిపించారు. ఇది చాలా విచారకరమైన పరిస్థితిని వెల్లడిస్తోందని అన్నారు. 15కు పైగా ట్రిబ్యునళ్లకు ప్రిసైడింగ్ అధికారులు లేరని న్యాయస్థానం తెలిపింది. ఖాళీలను భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించిన పేర్లను ప్రభుత్వం ఎక్కువ శాతం తిరస్కరించిందని పేర్కొంది. ట్రిబ్యునళ్ల ఖాళీలపై సుప్రీంకోర్టు ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తానని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కోర్టుల్లో కేసుల కారణంగా నియామకాలు నిలిచివుండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన జస్టిస్ సూర్యకాంత్.. ట్రిబ్యునల్స్లోని సభ్యుల పదవీ కాలానికి సంబంధించి మాత్రమే ఫిర్యాదులున్నాయని, కేసులతో సంబంధం లేని నియామకాలను చేపట్టవచ్చని సూచించారు. జాతీయ, ప్రాంతీయ జిఎస్టి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాది అమిత్ షాణి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేసిన న్యాయస్థానం కేంద్రంతో పాటు జిఎస్టి కౌన్సిల్కు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 16కు వాయిదా వేసింది.