Aug 01,2021 08:45

వేలూరు : మద్యానికి బానిసయిన భర్త భార్యతో రోజూ గొడవపడుతుండటంతో తీవ్రమనస్తాపానికి గురయిన భార్య తన బిడ్డకు ఉరేసి అదే చీరతో తానుకూడా ఉరేసుకున్న విషాదఘటన శనివారం రాణిపేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే... కావేరిపాక్యం సమీపంలోని సిత్తంజి గ్రామానికి చెందిన దయాలన్‌కు భార్య వెన్నిల (35) కు కుమార్తెలు కీర్తి, హరిత (3) ఉన్నారు. వెన్నిల భర్త దయాలన్‌ కూలి పనులు చేస్తూ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. గత శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన దయాలన్‌ మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెన్నిల తన ఇద్దరు కుమార్తెలలో ఒక కుమార్తెను తీసుకుని ఇంటి వెనుక వైపుకు వెళ్లింది. చీరతో హరితకు ఉరివేసి అదే చీరతో తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం తల్లీకుమార్తెలు చెట్టుకు వేలాడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని ఇచ్చారు. ఘటనా స్థలానికి అవ్యలూరు పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను వాలాజ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.