Aug 07,2021 20:56
తీవ్రంగా గాయపడిన ప్రియతమ్‌, ఆదర్శ మౌళి

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (గుంటూరు) : గుంటూరు జిల్లా సత్తెనపల్లి నలంద ఇంజనీరింగ్‌ విద్యార్థులు గ్యాంగ్‌వార్‌కు పాల్పడ్డారు. సీనియర్‌, జూనియర్‌ విద్యార్థుల మధ్య శనివారం కళాశాల వద్ద ఘర్షణ జరిగింది. క్రికెట్‌ బ్యాట్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నలంద ఇంజనీరింగ్‌ కళాశాలలో గుంటూరుకు చెందిన నందేటి ప్రియతమ్‌ ఇంజనీరింగ్‌ 4వ సంవత్సరం, అదే కళాశాలలో ముప్పాళ్ల మండలం కుందూరివారి పాలెంనకు చెందిన సైకం గురు కార్తీకరెడ్డి ద్వితీయ సంవత్సరం చదువున్నాడు. కార్తీక్‌పై ప్రియతమ్‌ కామెంట్‌ చేయడంతో వివాదం మొదలైంది. కళాశాల బయట కార్తీక్‌, ప్రియతమ్‌ రెండు గ్రూపులుగా విడిపోయి తన్నుకున్నారు. కార్తీక్‌ రెడ్డి స్నేహితులు శ్రీను, శ్యాంసుందర్‌, గోపి కలిసి ప్రియతమ్‌, అతని సోదరుడు ఆదర్శమౌళిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన తమ్ముడిని ప్రియతమ్‌ కారులో సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో కార్తీక రెడ్డి గ్యాంగ్‌ అడ్డుకుంది. దీంతో కార్తీక్‌ గ్యాంగ్‌ను.. ప్రియతమ్‌ కారుతో ఢకొీట్టాడు. ఈ ఘటనలో కార్తీక్‌ గ్యాంగ్‌కు చెందిన శ్రీను, శ్యాంసుందర్‌, గోపి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.