- యువత ముందుకు రావాలి
- తెలుగు షార్ట్ఫిల్మ్ అసోసియేషన్ పిలుపు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలుగు షార్ట్ఫిల్మ్ అసోసియేషన్ ఆధ్వర్యాన సెప్టెంబరు 24, 25 తేదీల్లో షార్ట్ఫిల్మ్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివిరాజు తెలిపారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో పోటీల బ్రోచర్లను అసోసియేషన్ నాయకులు శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డివి రాజు మాట్లాడుతూ సెప్టెంబరు 24న ప్రముఖ దర్శక, నిర్మాత, పత్రిక సంపాదకులు చక్రపాణి (ఆలూరు వెంకటసుబ్బారావు) వర్థంతి, 25న గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్థంతిని పురస్కరించుకుని పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బికెఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ పోటీలకు వచ్చిన వీడియోలన్నిటిలో ఉత్తమమైన 40 వీడియోలను 24, 25 తేదీల్లో ఎంబి విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుండి 8 గంటల వరకు ప్రదర్శిస్తామని అన్నారు. వాటిలో 5 ఉత్తమమైన వీడియోలకు నగదు రూ.5 వేలు, జ్ఞాపిక, సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా ప్రముఖ దర్శకులు ఎన్.శంకర్, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్పి పట్నాయక్ రానున్నారని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అసోసియేషన్ కృష్ణా జిల్లా అధ్యక్షులు కొప్పుల అశోక్ ఆనంద్ మాట్లాడుతూ షార్ట్ఫిల్మ్ నిడివి 10 నిమిషాలకు మించకూడదని, కులమతాలకు అతీతంగా, అశ్లీలతకు తావులేకుండా ఉండాలని తెలిపారు. గతంలో పంపినవి కాకుండా కొత్త వీడియోలను మాత్రమే పంపాలని సూచించారు. పోటీలకు ఎంట్రీ ఫీజు లేదని పేర్కొన్నారు. సెప్టెంబరు 15లోపు వీడియోలను ్వశ్రీబస్త్రబరటaఏస్త్రఎaఱశ్రీ.షశీఎకు పంపాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9391163508, 9440497672కు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వలీనాగరాజు, ఆర్.రాజశేఖర్, దగాని కిరణ్, గాదె సుబ్బారెడ్డి, ఆడారి సురేంద్రకుమార్ పాల్గన్నారు.